ద్విచక్ర వాహనం నడుపుతూ నిద్ర మత్తులోకి జారుకున్న విద్యార్థి మృత్యుపాలవగా, మరొకరు గాయపడిన ఘటన బుధవారం ప్రత్తిపాడు శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం. ప్రత్తిపాడుకు చెందిన బొబ్బూరి శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కొడుకు చాణక్య శ్రీవెంకటశివ (17) ఉన్నారు. గుంటూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన విద్యార్థి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లారు.
అందరూ దైవదర్శనం చేసుకొని బుధవారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికి వెంకటశివ తన మిత్రడు శ్రీనివాస్ను తీసుకొని ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తూ ప్రత్తిపాడు శివారు రామవాగు వద్దకు చేరుకుంటుండగా బండి నడుపుతున్న చాణక్యను నిద్ర మత్తు ఆవహించింది. వెంటనే వాహనం రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని వాగులో పడిపోయింది.
వాగుపైనున్న చప్టాపై పడిన చాణక్య తలకు బలమైన దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని చాణక్యను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. నిద్ర మత్తులో ప్రమాదం జరిగినట్లు మృతుడి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa