ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలలు పట్టుకున్న కోనసీమ ఏజెన్సీ ప్రజాప్రతినిధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 03:32 PM

తూర్పుగోదావరి జిల్లా పునర్విభజనలో భాగంగా కోనసీమ జిల్లాలో అసంతృప్తి సెగలు మిన్నంటుతున్నాయి. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసి, కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని అభ్యర్ధించినప్పటికీ ఫలితం రాలేదు.


1 నవంబరు 1956లో ఉమ్మడి మద్రాస్‌ నుంచి ఏళ్ల ఉద్యమాల ఫలితంగా తెలుగు ప్రజలతో ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రధేశ్‌ నుంచి 10 జిల్లాల కూటమితో తెలంగాణ ప్రాంతం విడిపోవటంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయి మిగిన 13 జిల్లాలతో నవ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో పడింది. అమరావతి రాజధానిగా పరిపాలన సాగించే క్రమంలో అనేక రాజకీయ పరిణామాల పర్యవసానం మరోసారి జిల్లాల పునర్విభజన తెరమీదకు వచ్చింది.


ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో అసమ్మతి సెగలు రాజుకున్న విషయం విదితమే. రాజవొమ్మంగి, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, చింతూరు, విఆర్‌పురం, కూనవరం, ఎటపాక (ఏడు) మండలాల కూటమిగా ఉన్న రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాల్సిందిగా గిరిపుత్రులు ఏడాదిగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదు.


కాకినాడ ప్రతిపాదిత జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళ్లరేవు, కాజులూరు మండలాలను యథావిధిగా కాకినాడలోనే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు చేసిన ఉద్యమం నీరుగారిపోయింది. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతిపాదిత కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కాకినాడ రూరల్‌ మండలానికి చేరులోవలో ఉన్న అనపర్తి మండలాన్ని ప్రతిపాదిత గోదావరి జిల్లా (రాజమండ్రి)లో కలవద్దని ఆ ప్రాంత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని కాకినాడలోనే కొనసాగించారు.


ఇదిలా ఉండగా అమలాపురం రెవిన్యూ డివిజన్‌ (కోనసీమ) కు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని ముమ్మిడివరం మండలం కొమ్మనాపల్లిలో 21 నవంబర్ 2019 న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార భరోసా కార్యక్రమంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ బహిరంగా సభాముఖంగానే ముఖ్యమంత్రిని అభ్యర్ధించారు. రాష్ట్ర ప్రభత్వం 26 జనవరి 2022న జిల్లాల పునర్విభజన గెజెట్‌ను విడుదల చేసినప్పటి ఆ ప్రాంత ప్రజా సంఘాలు శాంతియుత అభ్యర్థన కార్యక్రమాన్ని కొనసాగించారు.


అమలాపురం ఎంపీ చింతా అనురాధ, అమలాపురం  ఎమ్మెల్యే , సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్‌, కొత్తపేట  ఎమ్మెల్యే, ప్రభుత్వ ఛీప్‌విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, రామచంద్రాపురం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖా మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ సంయుక్తంగా ముఖ్మమంత్రిని కలిసి కోనసీమ జిల్లాకు డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాల్సిందిగా కోరారు. అయినప్పటికీ వారి అభ్యర్థనను  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిగణలోనికి తీసుకోలేదు.


అటు గిరిపుత్రుల ఆక్రందన, ఇటు కోనసీమ ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి పరిగణలోనికి తీసుకోకపోవడంతో ఈ రెండు ప్రాంతాల్లో అసమ్మతి సెగలు ఎగజిమ్ముతున్నాయి. దాని ప్రభావం వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందని ఉద్యమ నేతలు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa