సినిమాల్లోనూ కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరోస్ ఉంటారు. ఇంకొకరి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడం మామూలు విషయం కాదు. అలా చేయాలంటే ఎదుటివారి కష్టానికి కదిలిపోయే మనస్సు ఉండాలి. ఎంతో గుండె ధైర్యం ఉండాలి. తరచుగా ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. తెరపై హీరోలు తమ ప్రాణాలు గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం ప్రమాదాలకు ఎదురు వెళ్తుంటారు. అయితే ఇలాంటి సంఘటన ఒకటి బయట కూడా జరిగింది. ఓ పోలీస్ మంటల్లోకి వెళ్లి ఓ చిన్నారిని రక్షించి రియల్ హీరో అనిపించుకున్నారు. రాజస్థాన్లో ఓ పోలీస్ తన ప్రాణాలను అడ్డుపెట్టి.. ఓ పాపను రక్షించారు. హిందువుల కొత్త ఏడాది సందర్భంగా శనివారం కరౌలీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు నినాదాలు చేయడం, ఆపై హింస చెలరేగింది. ర్యాలీలో పాల్గొన్నవారు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్నదుకాణాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక ఇంటికి మంటలు వ్యాపించాయి. అందులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు చిక్కుకుపోయారు. మంటల కారణంగా వాళ్లు బయటకు రాలేకపోయారు. దానిని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ అక్కడకు వెళ్లారు. మహిళ చేతిలో ఉన్న పాపను తన చేతుల్లో తీసుకుని, వారిని తనను అనుసరించమని చెప్పి, చిన్నారిని గుండెలకు హత్తుకుని మంటల్లోంచి బయటకు పరుగులు తీశారు. బయటపడిన తర్వాత ఆ పాపను ఆ మహిళకు అప్పగించారు. అయితే ఈ సంఘటనను ఎవరో తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నేత్రేష్ శర్మ సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. పోలీసు అధికారులు సైతం నేత్రేష్కు అభినందలు తెలిపారు. నేత్రేష్ శర్మ మాత్రం చాలా సింపుల్గా తన డ్యూటీ తను చేశానని అన్నారు. ఇదిలా ఉండగా ఈ హింసాత్మక ఘటనలో 42 మంది ప్రజలతో పాటు నలుగురు పోలీసులు సైతం గాయపడ్డారు. 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 21 బైకులను, ఇతర వాహనాలను సీజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa