ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటకు పంపిన విధానాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నా

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 04:03 PM

ఇంతవరకు తామున్న బంగా నుంచి బయటకు పంపిన విధానాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తును అని ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను 12 జనపథ్‌లోని ప్రభుత్వ బంగ్లా నుంచి గతవారం అధికారులు ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. అయితే, అత్యంత అవమానకరంగా తమ కుటుంబాన్ని బంగ్లా నుంచి బయటకు పంపారని ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తాజాగా ఆరోపించారు. తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ బంగ్లాలో ఉండేందుకు తమకు అర్హత లేనందున దానిని ఖాళీ చేయడానికి సిద్ధమయ్యామని ఆయన తెలిపారు.


‘‘ప్రభుత్వం బంగ్లా కాబట్టి అందులో శాశ్వతంగా ఉండలేం.. మేము కూడా మా సొంతమని ఎప్పుడూ భావించలేదు.. కానీ, ఈ బంగ్లాలో చాలా సంవత్సరాలు ఉండటం నా అదృష్టం.. మా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు దీనితో సుదీర్ఘ అనుబంధం ఉంది.. ఇది వాస్తవంగా సామాజిక న్యాయ ఉద్యమానికి పుట్టిల్లు.. లాక్‌డౌన్ సమయంలో ఈ బంగ్లా పక్క నుంచి వలసకూలీలు నడిచి వెళ్లడం చూసి ఆయన చలించిపోయారు.. ప్రధానికి తన ఆవేదన తెలియజేశారు.. ఇల్లు విడిచిపెట్టినందుకు బాధ లేదు...ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ చేయాల్సిందే.. బయటకు పంపిన విధానాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


ఖాళీ చేయడానికి గడువు తేదీ మార్చి 20గా నిర్ణయించారని, అంతకు ముందే తాను వెళ్లేందుకు సిద్ధమయ్యానని ఎంపీ తెలిపారు. ‘‘నేను వెళ్లిపోతుంటే ఎందుకు అడ్డుకున్నారో.. ఉండమని ఎందుకు హామీ ఇచ్చారో తెలియదు.. క్యాబినెట్‌లోని ఓ సీనియర్ మంత్రి నన్ను మార్చి 29న పిలిపించి బంగ్లా ఖాళీ చేయెద్దని హామీ ఇచ్చారు.. మా తండ్రి ఫోటోలను రోడ్డుమీదకు విసిరేసి.. చెప్పులతో తొక్కుకుంటూ వెళ్లారు.. ఈ ఏడాది మీరు పద్మభూషణ్ ఇచ్చిన వ్యక్తికా ఈ విధమైన అవమానం.. ఆయన జ్ఞాపకాలను అవమానించారు’’ అని చిరాగ్ వాపోయారు.


ప్రధాని నరేంద్ర మోదీని రాముడిగా.. మిమ్మల్ని మీరు హనుమంతుడిగా చెప్పుకునేవారు? కదా అన్న ప్రశ్నకు .. గత ఏడాదిన్నర నుంచి నా దారిలో నేను వెళ్తున్నాను.. పరస్పర గౌరవం లేని పొత్తుల వల్ల ప్రయోజనం ఉండదు అని పాశ్వాన్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ.. రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత 2020లో జరిగిన బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది. అంతేకాదు, గతేడాది చిరాగ్ బాబాయి పశుపతి పరాస్ పార్టీలో చీలిక తెచ్చి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.


‘‘తొలుత మా కుటుంబాన్ని చీల్చారు.. తర్వాత సొంత పార్టీ నుంచి, ప్రస్తుతం ఈ బంగ్లా నుంచి నన్ను వెళ్లగొట్టారు.. కానీ, నేను పులి బిడ్డను.. ‘బిహార్ ఫస్ట్.. బిహారీలే ఫస్ట్’ అనే నా మిషన్ కోసం పనిచేస్తూనే ఉంటాను.. నేను మరింత స్పష్టతతో పని చేస్తాను’’ అని చిరాగ్ స్పష్టం చేశారు. అయితే, మోదీ సంబంధాలపై మాట్లాడటానికి మాత్రం ఆయన నిరాకరించారు.


చిరాగ్ తండ్రి, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు 12 జన్‌పథ్‌లో ఒక బంగ్లా కేటాయించారు. ఆయన మరణానంతరం 2021 ఆగస్టులో ఆ బంగ్లాను కేంద్ర రైల్వేలు, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేటాయించారు. దీంతో చిరాగ్ పాశ్వాన్‌కు ఆ బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు పంపారు. ఎల్‌జేపీ ఈ బంగ్లాను అధికారిక చిరునామాగా చేసుకుని, సంస్థాగత, ఇతర కార్యక్రమాలను నిర్విహించేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa