రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసైనికులు ఎవడి పల్లకీ మోసేది లేదని.. రాష్ట్ర ప్రజల్ని పల్లకీ ఎక్కిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేది లేదని..’ తాను ఊరికనే చెప్పలేదని, చాలా ఆలోచించాకనే ఈ మాట అన్నానని తెలిపారు. అయితే, ఈ మాటను అడ్డుపెట్టుకుని మరొకరి పల్లకీ మోసేందుకు సిద్ధంగా ఉండాలంటూ వైసీపీ నాయకులు జనసైనికులపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.
తానేంటో జనసైనికులకు తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని తానంటే.. సొంత పార్టీ నాయకులే భిన్నవాదనలు వినిపిస్తున్నారని వెల్లడించారు. అయితే, ‘‘వ్యూహాన్ని నాకు వదిలెయ్యండి.. నేను చూసుకుంటాను. ప్రజల్ని పల్లకీ ఎక్కించే వ్యూహం నా దగ్గర ఉంది.’’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇక, రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాదని, రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడొద్దని పరోక్షంగా వార్నిగ్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో.. అధికార పార్టీ తీరుపై పవన్ నిప్పులు చెరిగారు. జనసేన భవిష్యత్ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై చాలా ఆలోచించే మాట్లాడాను. వైసీపీ ప్రభుత్వ అరాచకం, దోపిడీ వల్లే ఆ మాట అన్నా. రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందువల్లే అలా మాట్లాడా. వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని రాజకీయ వ్యూహం కోసం అనలేదు. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే జనసేన సిద్ధంగా ఉంది. ఎవరి పల్లకీ మోసేందుకు మేం ఇక్కడ లేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటే ఎందుకంత ఉలుకు?. జనసేన అంటే వైసీపీ నేతలకు ఎందుకు భయం?
2018లో కరెంటు ఛార్జీల పెంపును జగన్ వ్యతిరేకించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మీరెందుకు కరెంటు ఛార్జీలు పెంచారు? ఇప్పుడున్నది కొత్త తరమని వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలి. చెత్త పన్ను పెంచారు. వేలాది మంది కౌలు రైతులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం రద్దు చేశారు. 100 మంది దగ్గర పన్నులు వసూలు చేసి మీరు అనుకున్న 35 నుంచి 40 మందికో ఇస్తే మిగతా 60.. 65 మంది ఏం కావాలి?’’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొంటామని.. ఇందుకు తమ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa