ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖననం చేశాక...ఇంటికి తిరిగొచ్చాడు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:00 AM

 


ఓ వ్యక్తి మరణించాడని భావించి అతని ఖననం చేశాక అతను తిరిగిరావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు ఈ ఘటనపై విచారణ కూడా సాగుతోంది. అంత్యక్రియలు నిర్వహించిన 24 గంటల తర్వాత చనిపోయిన వ్యక్తి సజీవంగా ఇంటికొచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని బనగలద్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. 55 ఏళ్ల మూర్తి  రోజు కూలీ. చెరుకు కోసేందుకు కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం మూర్తి కుమారుడు కార్తికి బంధువుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తండ్రి మూర్తి సమీపంలోని బస్టాప్‌లో శవమై కనిపించాడన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. అది విన్న కార్తి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి అది తన తండ్రిదేనని నిర్ధారించాడు. 


విషయం తెలిసిన సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. కుటుంబ పెద్ద చనిపోయిన విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన మూర్తిని చూసి నిర్ఘాంతపోయారు. తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. అతడి కుమారుడు కార్తి అయితే షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తన తండ్రి మరణవార్త విని ఎంత షాక్ అయ్యానో, ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అనంతరం ఈ సమాచారాన్ని కార్తి పోలీసులకు చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పుడు చనిపోయింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa