తలసారి ఆదాయంలో భారతదేశం కాస్త పుంజుకొన్నా రానున్న రోజుల్లో మాత్రం నష్టం తప్పదని ఐఎంఎఫ్ స్పష్టంచేసింది. గత ఏడాది కరోనా ప్రభావంతో భారత ఆర్థిక వృద్ధి కొంత కుంటుపడిన సంగతి తెలిసిందే. ఆర్థిక పురోగతి మందగించడంతో ప్రజల ఆదాయంపైనా ప్రభావం పడింది. అదే సమయంలో మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మాత్రం మంచి వృద్ధి కనబర్చింది. దీంతో గత ఏడాది మే నెలలో తలసరి ఆదాయంలో బంగ్లా మన దేశాన్ని వెనక్కి నెట్టేసింది. కరోనా టైంలోనూ బంగ్లాదేశ్ తలసరి ఆదాయం పెరగ్గా.. భారత తలసరి ఆదాయం మాత్రం పెరగలేదు. దీంతో ఇండియా కంటే తమ తలసరి ఆదాయం 280 డాలర్లు ఎక్కువగా నమోదైందని బంగ్లాదేశ్ కేబినెట్ సెక్రటరీ అన్వరుల్ ఇస్లాం గతంలో ప్రకటించారు.
కానీ ఏడాది తిరిగేలోపు భారత్ పుంజుకుంది. తలసరి ఆదాయంలో మన దేశం మళ్లీ బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టింది. 2021-22లో పొరుగు దేశం కంటే ఇండియా తలసరి ఆదాయం 38 డాలర్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. వాస్తవానికి 2020-21లో భారత తలసరి ఆదాయం 1935 డాలర్లు ఉండగా.. బంగ్లా తలసరి ఆదాయం 1962 డాలర్లుగా ఉంది.
ప్రస్తుతం మనం బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టినప్పటికీ.. రాబోయే సంవత్సరాల్లో దాన్ని నిలబెట్టుకోవడం కష్టమని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2027-2028 నాటికి భారత తలసరి ఆదాయం కంటే బంగ్లా తలసరి ఆదాయం 200 డాలర్లు ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ప్రస్తుత ధరల ప్రకారం పర్ క్యాపిటీ జీడీపీని లెక్కలుగట్టి ఐఎంఎఫ్ ఈ అంచనాకు వచ్చింది.
బంగ్లాదేశ్ ఎక్కువగా టెక్స్టైల్స్ ఎగుమతి చేస్తోంది. దీనికి శ్రామిక శక్తి ఎంతో అవసరం. బంగ్లా జీడీపీలో టెక్స్టైల్స్ రంగం వాటా 20 శాతం కాగా, ఆ దేశ ఎగుమతుల్లో ఈ రంగం వాటా 80 శాతం కావడం గమనార్హం. దక్షిణాసియాలో భారత్ తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్. గత ఆరేళ్లుగా బంగ్లా జీడీపీ నిలకడగా ఆరు శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. కరోనా సమయంలో భారత్ ఇబ్బంది పడగా.. బంగ్లా జోరు మాత్రం వృద్ధి బాటలోనే కొనసాగింది.
బంగ్లాదేశ్ తలసరి ఆదాయం విషయంలో మనల్ని వెనక్కి నెడుతుందనే ఐఎంఎఫ్ అంచనాలను పక్కనబెడితే.. 2007లో ఆ దేశ తలసరి ఆదాయం మన దేశ తలసరి ఆదాయంలో సగం మాత్రమే. కానీ ఈ పదిహేనేళ్లలో బంగ్లా అద్భుతమైన పురోగతి సాధించింది. మన కంటే మెరుగైన పనితీరు కనబర్చింది. భవిష్యత్తులోనూ బంగ్లా ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉందని అంచనా. ఆ దేశం ఏర్పడక ముందు కలిసి ఉన్న పాకిస్థాన్ మాత్రం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa