కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో అన్ని రకాల సేవలకు భక్తులను అనుమతిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ అధికారులు ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు (మంగళవారం) ఉదయం 9 గంటలకు అందుబాటులోకి తేనున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.
దీంతో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన భక్తులకు సమాచారం అందిస్తారు.
భక్తులు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa