ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంపకాల్లో వచ్చిన తేడా...ఆ కిలాడి చేసిన హత్యను వెలుగులోకి తెచ్చింది

Crime |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:26 AM

పెళ్లిలో వేసే మూడు ముళ్లు...ఏడు అడుగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవితాంత నీతో కలసి నడుస్తానని భార్య, భర్తలు  ప్రతినబూనే సందర్బం అది. కానీ ఆ వివాహ బంధానికే మచ్చ తెచ్చిందో భార్యామణి. తన భర్తను హత్యచేసి తప్పించుకోగలనని భావించింది. కానీ ఊహించని విధంగా కటకట్టాల పాలైంది.


కట్టుకున్నవాడు అందంగా లేడని ఓ భార్య అతి దారుణంగా అతడిని చంపేసింది. అందుకోసం ప్రియుడితో కలిసి పథకం రచించింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లిళ్లలో పాటలు పాడుతూ ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్ రెడ్డి పెళ్లిళ్లలో వంటలు చేస్తూ ఉండేవాడు. ఓ పెళ్లి వేడుక సందర్భంగా వీరివురి మధ్య పరిచయం ఏర్పడింది. యువతిని ఇష్టపడిన వెంకట్ రెడ్డి ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె అంగీకారం తెలపడంతో పదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.


అయితే, పెళ్లి తర్వాత ఆమె ఆలోచన మారింది. భర్త నల్లగా ఉన్నాడని స్నేహితులు అన్న మాటలు విని అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. దంపతుల మధ్య ఈ విషయంపై తరచూ గొడవ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెకు పాటలు పాడే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చూడ్డానికి బావుండటంతో అతడిపై మనసు పడింది. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.


ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఆమె అందుకు భర్త అడ్డును తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్రణాళిక రచించింది. పథకంలో భాగంగా రెండు రోజుల కిందట ప్రియుడి సాయంతో భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు ఇద్దరు వ్యక్తులతో బేరం కుదుర్చుకుంది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.


ఆమె వద్ద డబ్బులు తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు వెంకట్ రెడ్డి మృతదేహాన్ని తీసుకొని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం, కూరెళ్ల గ్రామ శివారులో పాతి పెట్టించింది. ఆ తర్వాత శవాన్ని పాతిపెట్టిన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో వారిలో ఒక వ్యక్తి నేరుగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వెంకట్ రెడ్డిని చంపి పాతి పెట్టిన విషయాన్ని చెప్పాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వెంకట్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తన నేరాన్ని అంగీకరించింది. తన భర్త నల్లగా ఉన్నందున అతడితో కాపురం చేయడం ఇష్టంలేక హత్య చేయించినట్లు పోలీసుల విచారణంలో అంగీకరించింది. నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడు, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa