సొంత నియోజకవర్గంలో పట్టుకోల్పోకూడదని భావిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. నేను మీతోనే ఉంటా అని స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించే రీతిలో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తర్వాత కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో త్వరలోనే ఇంటి నిర్మాణం చేపడతానని వెల్లడించారు. నెలలో వీలైనన్ని రోజులు స్థానికంగా ఉంటూ.. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత 35 సంవత్సరాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. చంద్రబాబుకు కంచుకోటగా భావించే కుప్పం నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతుండటంతో అలర్ట్ అయ్యారు.
ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలో సొంతింటి నిర్మాణం పనులను త్వరలో ప్రారంభించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేపడుతున్నారు. శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురం వద్ద.. కుప్పం- పలమనేరు జాతీయ రహదారి సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో భూమి పూజ చేపట్టనున్నారు. చంద్రబాబు కుటుంబం మొత్తం ఈ భూమి పూజలో పాల్గొంటారని స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు తెలిపారు. దాదాపు రెండెకరాల భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో స్థలం చదును చేసే కార్యక్రమాన్ని చకచకా చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa