ఆందోళనలు చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయడమే కాదు. అనారోగ్యం బారిన పడితే చికిత్స అందించడం కూడా తెలుసని ఏసీపీ నిరూపించారంటూ ఓ పోలీసు అధికారిపై కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ ప్రశంసలు ఎందుకంటారా...? సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ పిలుపు మేరకు రాజభవన్ ఎదుట నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో విజయవాడతోపాటు పలు జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
నిరసన ప్రదర్శన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణ లంక పోలీస్టేషన్కు తరలించారు. ఎండ వేడిమి, బీపీ పెరగడంతో శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు కంగారు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ డాక్టర్ రవి కిరణ్ వెంటనే అక్కడికి బయల్దేరి వెళ్లారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన శైలజానాథ్తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయనకు బీపీ చెక్ చేసి ప్రథమ చికిత్స అందించారు.
ఇదిలావుంటే 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శింగనమల ఎమ్మెల్యేగా గెలుపొందిన శైలజానాథ్.. ప్రాథమిక విద్యాశాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్రం విడిపోయాక ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. 2020 జనవరిలో సోనియా గాంధీ ఆయన్ను పీసీసీ చీఫ్గా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa