ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతవిద్వేషాలకు రోజుకో పన్నంగా సాగుతూనే ఉంది. ఇటీవల ఆ రాష్ట్రంలో వరసగా మత సంబంధిత వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల దేవుళ్లు పోస్టర్లు, బ్యానర్ల చుట్టూ గొడవలు రాజుకున్నాయి. వాటికి బ్రేక్ పడిందనుకుంటుండగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా ప్రాంగణంలోకి మాంసం విసిరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముస్లింల బక్రీద్ పండుగ వాతావరణాన్ని పాడు చేసేందుకు ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
బరేలీలోని కోహ్దాపీర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని ఎస్ఎస్పీ సిద్ధార్థ్ అనిరుధ్ పంకజ్ తెలిపారు. అయితే గురుద్వారాలో మాంసాన్ని చూసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఆవరణలో పడి ఉన్న మాంసాన్ని గుర్తించామని, కానీ దానిని విసిరే వ్యక్తులు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
దీనిపై గురుద్వార అధినేత హర్వంత్ పాల్ సింగ్ బేడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సిక్కులు నిరసన తెలిపారు. ఆ ప్రాంతంలో సిక్కు దుకాణదారులు సోమవారం తమ షట్టర్లను మూసివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa