ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి తలపోటుగా మారిన వరణ్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 03:50 AM

బీజేపీకి ఆ పార్టీ నేత, ఎంపీ వరణ్ గాంధీ పెద్ద తలపోటుగా మారారు. ప్రతి అంశంలో సొంతపార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన టార్గెట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఇచ్చే ఉచితాలపై చర్చ నడుస్తోంది. ఉచిత పథకాల వల్ల ప్రజలకు ఒరిగేది లేదని, ఇది ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉద్ఘాటించారు. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సైతం ఎన్నికల్లో లబ్ధికి ఉచితాలను ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఉచితాలపై చర్చించాలని తాజాగా రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్‌ మోదీ నోటీసులిచ్చారు. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన వరుణ్ గాంధీ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చే ఉచితాల గురించి చర్చించే ముందు ఎంపీల పెన్షన్లు, వారికి కల్పించే సౌకర్యాల గురించి చర్చించాలని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.


‘‘సుశీల్ మోదీ ఈరోజు సభలో 'ఉచితాల సంస్కృతి'కి ముగింపు పలికే చర్చను ప్రతిపాదించారు.. అయితే ప్రజలకు అందించిన ఉపశమనంపై వేలుపెట్టే ముందు, మన స్వంత దృష్టిలో మనం చూసుకోవాలి.. ఎంపీలకు పెన్షన్లు సహా ఇతర సౌకర్యాలన్నింటినీ రద్దు చేయడంపై చర్చ ఎందుకు ప్రారంభించకూడదు?’’ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.


ఎల్పీజీ సిలిండర్ల ధరలపైనా వరుణ్ గాంధీ మరో ట్వీట్‌ చేశారు. పెరిగిన సిలిండర్‌ ధర, అరకొర సబ్సిడీలతో ఉజ్వల స్కీమ్‌ అసలు లక్ష్యం నెరవేరడం లేదని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో 4.13 కోట్ల మంది ప్రజలు ఒక్క గ్యాస్‌ సిలిండర్‌నూ రీఫిల్‌ చేసుకోలేదని, 7.67 కోట్ల మంది కేవలం ఒక్కసారి మాత్రమే గ్యాస్‌ను రీఫిల్‌ చేసుకున్నారని వివరించారు. కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని ఉటంకిస్తూ.. ఇలాగైతే పథకం లక్ష్యం ఎలా నెరవేరుతుందంటూ? ప్రశ్నించారు.


‘‘ గత ఐదేళ్లలో, 4.13 కోట్ల మంది ప్రజలు ఒక్క ఎల్పీజీ రీఫిల్‌ను కొనుగోలు చేయలేకపోయారు.. 7.67 కోట్ల మంది దానిని ఒక్కసారి మాత్రమే రీఫిల్ చేశారు.. పెరుగుతున్న దేశీయ గ్యాస్ ధరలు, అతితక్కువ సబ్సిడీలతో పేదల 'ఉజ్జ్వల పొయ్యిలు' ఆరిపోయాయి.. “క్లీన్ ఫ్యూయల్, బెటర్ లైఫ్” వాగ్దానాలు నెరవేరుతాయా?’’ అని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa