ఉగ్రవాదం మరోసారి పంజావిసిరింది. జమ్మూ కశ్మీర్లో సాధారణ పౌరులు, వలస కూలీలే లక్ష్యంగా ముష్కరమూకలు కాల్పులకు తెగబడ్డాయి. పుల్వామా జిల్లా గడూర గ్రామంలో వలస కార్మికులపైకి ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో బిహార్లోని స్కవా పరాస్కు చెందిన మహ్మద్ ముంతాజ్ అనే వలస కార్మికుడు మృతిచెందాడు. గాయపడిన మహ్మద్ మక్బూల్, మహ్మద్ ఆరిఫ్లు కూడా బిహార్కు చెందిన వలస కూలీలే. గాయపడిన ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దుచేసిన మూడో వార్షికోత్సవం ముందు రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆర్టికల్ 370ను 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దుచేయడాన్ని స్థానిక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆగస్టు 5 జమ్మూ కశ్మీర్ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, 2019 అక్టోబరు నుంచి స్థానికేతర కూలీలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. కశ్మీర్ పండిట్లు, హిందువులపై వరుస దాడులు లోయ వారి భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో వరుస దాడులతో భయాందోళనకు గురయిన వేలాది కశ్మీర్ పండిట్ ఉద్యోగులు తమ విధులకు హాజరుకావడం లేదు. వీరిలో చాలా మంది లోయలో తమకు భద్రత లేదని భావించి ప్రాణభయంతో జమ్మూకు వలస వెళ్లిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa