ప్రసాదం కొందరి పాలిట శాపంగా మారింది. ఆ ప్రసాదం కాస్త ఫుడ్ పాయిజన్ గా మారింది. అసోంలోని మజులి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మతపరమైన కార్యక్రమంలో ప్రసాదం తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జిల్లాలోని గర్మూర్ సమీపంలోని మహరిచుక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో పంచిన ప్రసాదం తిన్న వెంటనే చాలామంది కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిని 18 మందిని శ్రీశ్రీ పీతాంబర్ గోస్వామి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. అందులో ముగ్గురు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా జరిగి ఉంటుందని స్థానిక అధికారులు అంటున్నారు. "అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది." అనిమజులీ జిల్లా డిప్యూటీ కమిషనర్ పులక్ మహంత చెప్పారు.
ఆస్పత్రిలో చేరిన 18 మందిలో ముగ్గురు చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారని, అర్ధరాత్రి 12 మంది కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికి వచ్చారని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య గోస్వామి చెప్పారు. "శనివారం ఉదయం మరో ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చారు. వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసుగా మేము అనుమానిస్తున్నాం." డాక్టర్ అమూల్య గోస్వామి చెప్పారు.
జూలై మొదటి వారంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పంజాబ్లోని గురుద్వారాలో ప్రసాదం తిని పది మంది అస్వస్థతకు గురయ్యారు. రఘువీర్ సింగ్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఆయన వారింట్లో ప్రార్థనలు చేసి అందరికి భోజనాలు పెట్టారు. అనంతరం ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని తార్న తరణ్ గురుద్వారాకి తీసుకెళ్లి భక్తులు పంచిపెట్టారు. అది తిన్న వెంటనే పది మంది అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa