ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మను కోల్పోయిన బాధ మినహా జీవితంలో మరే ఇతర లోటు లేదు: వెంకయ్య నాయుడు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 09:40 PM

బాల్యంలోనే తల్లిని కోల్పోయిన తనకు.. అమ్మను కోల్పోయిన బాధ మినహా జీవితంలో మరే ఇతర లోటు లేదని ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు తెలిపారు భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం నేటి (బుధవారం)తో ముగియనుంది. గురువారం నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ దన్ఖర్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా సోమవారం వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. వెంకయ్యను ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు. తెలుగు నేతో తనకున్న అనుంబంధాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 19 ఏళ్లపాటు రాజ్యసభ ఎంపీగా పని చేసిన వెంకయ్య.. రాజ్యసభ చైర్మన్ పదవిలో తన విధిని ఉత్తమంగా నిర్వర్తించానని భావిస్తున్నానన్నారు.


బాల్యంలోనే తల్లిని కోల్పోయిన తనకు.. అమ్మను కోల్పోయిన బాధ మినహా జీవితంలో మరే ఇతర లోటు లేదని వెంకయ్య నాయుడు తెలిపారు. ఏం కావాలనుకున్నానో అది చేశానని, కొన్ని పదవులు వాటంతట అవే వచ్చాయని ఆయన అన్నారు. వీడ్కోలు సభ సందర్భంగా వెంకయ్య ఓ దశలో భావోద్వేగానికి లోనయ్యారు.


కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పని చేసినప్పటికీ.. వెంకయ్య మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోయారు. విభజన సమయంలో బీజేపీ సభ్యుడిగా పార్లమెంట్‌లో గంభీరంగా మాట్లాడిన ఆయన.. ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని నాటి యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. మోదీ మాటలను వెంకయ్య నాయుడే తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రధాని కాగా.. వెంకయ్య కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని.. కేవలం ప్యాకేజీ మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.


గతంలో పవన్ కళ్యాణ్ లాంటి నేతలు ప్రత్యేక హోదా విషయమై వెంకయ్య నాయుణ్ని డైరెక్ట్‌గా అటాక్ చేశారు. మీకు రామ మందిరం మీద ఉన్న శ్రద్ధ, స్వర్ణభారతి ట్రస్ట్‌ మీద మీరు పెట్టిన శ్రద్ధ.. ప్రత్యేక హోదా మీద పెట్టి ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని 2017లో వెంకయ్యను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.


చివరకు ప్రత్యేక హోదా విషయమై టీడీపీ, వైఎస్సార్సీపీలతోపాటు వెంకయ్య నాయుడు కూడా చేయడానికి ఏమీ లేకపోయింది. ఆ తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. దీంతో బీజేపీకి రాజీనామా చేశారు. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టినప్పటికీ.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు పొందినప్పటికీ.. సొంత రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయాననే బాధ మాత్రం వెంకయ్య నాయుణ్ని ఎప్పటికీ వెంటాడుతుంటుందేమో..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa