ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన దేశం నిజమైన సవాళ్లను ఎదుర్కొంటుంది: రిషి సునాక్

international |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 08:46 PM

మన దేశం నిజమైన సవాళ్లను ఎదుర్కొంటుందని బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు. మరోవైపు మాజీ  ప్రధానిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్‌కు తాను రాజీనామా చేసినప్పటి నుంచి బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదని భారత సంతతికి చెందిన రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌.. ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చెల్టెన్‌హామ్‌లో టోరీ సభ్యులతో చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీగేట్‌ కుంభకోణంలో పార్లమెంట్‌ను మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పుదోవ పట్టించారా? అన్న అంశంపై కొనసాగుతోన్న విచారణపై సునాక్‌ అభిప్రాయంపై సభ్యులు ప్రశ్నించగా. ‘ఇది పూర్తిగా పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది.. ప్రభుత్వ ప్రక్రియ కాదు. కామన్స్‌ ప్రివిలెజెస్‌ కమిటీలోని ఎంపీలను గౌరవిస్తా. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు’ అని సునాక్ బదులిచ్చారు.


‘వ్యక్తిగతంగా నేను ఉన్నత ప్రమాణాలను విశ్వసిస్తాను. ప్రధానమంత్రి అయిన వెంటనే నేను క్యాబినెట్ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని తిరిగి నియమిస్తాను.. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాదలు.. రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలు.. ఈ విషయంలో నేను ముందుంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. సునాక్ సమాధానంపై సభ్యులనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమానికి టెలిగ్రాఫ్ అసోసియేట్ ఎడిటర్ కమిల్లా టోమినే మోడరేటర్‌గా వ్యవహరించారు.


‘‘ఈ నాయకత్వ రేసులో నేను ఎప్పుడూ ప్రజలు వినాలనుకునే విషయాలను చెప్పలేదు.. కానీ ప్రజలు వినాల్సిన విషయాలు నేను చెప్పాను. ఎందుకంటే మన దేశం నిజమైన సవాళ్లను ఎదుర్కొంటుంది.. వాటిని పరిష్కరించడానికి ఏమి అవసరమో నేను మీతో అందరితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా.. శుక్రవారం వేల్స్ పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు సునాక్‌ చేసిన వ్యాఖ్యలపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆయన వాటిని దాటవేశారు. కాగా, బోరిస్‌ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయానని చెబుతూ.. ఆర్థిక మంత్రి పదవికి రిషి సునాక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో బోరిస్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ , రిషి సునాక్‌ మధ్య తీవ్ర పోటీ నెలకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa