చిత్రసీమలో ఉచిత సలహాలు, వేరొకరి వ్యవహారంలో జోక్యం చేసుకునే పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. తాజాగా ప్రభాస్ కెరీర్ కు సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడట ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్.
బాహుబలి, సాహో, రాధేశ్యామ్ ... ఈ సినిమాలన్నీ కూడా ప్రభాస్ తన సొంత నిర్ణయం మీద ఇష్టపడి చేసిన సినిమాలు. ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్, స్పిరిట్ ...ఇవన్నీ కూడా కేవలం ప్రభాస్ నిర్ణయం మేరకే ప్రకటించబడిన ప్రాజెక్టులు. ఇన్ని భారీ బడ్జెట్ సినిమాల మధ్యలో ఒక చిన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ను చెయ్యాలనుకున్న ప్రభాస్ డైరెక్టర్ మారుతి కి ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాడట. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని ఎప్పటినుండో మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ పై ఇంకా అధికార ప్రకటన రాలేదు. కారణం ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. ప్రభాస్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని స్వయంగా మారుతి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడట అశ్వినీదత్. వందల కొద్దీ కోట్లు ఖర్చుపెట్టి తను ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే వంటి పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తుంటే, మారుతి వంటి చిన్న దర్శకుడితో స్మాల్ బడ్జెట్ మూవీని ప్రభాస్ చెయ్యటం అశ్వినీదత్ కు నచ్చలేదంట. ఈ విషయంపై ప్రభాస్ కు అశ్వినీదత్ హితబోధ చేస్తున్నాడట.
గోపీచంద్ తో జిల్ మూవీ తెరకెక్కించిన రాధాకృష్ణకుమార్ కు ప్రభాస్ రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను ఇచ్చాడు. రాధాకృష్ణకుమార్ తో పోల్చుకుంటే, మారుతి సక్సెస్ గ్రాఫ్ చాలా మెరుగు. మారుతితో ప్రభాస్ సినిమా చెయ్యడం పట్ల అశ్వినీదత్ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని కొంతమంది అంటున్నారు.