ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మురళీ మోహన్ వేల కోట్లు సంపాదించడానికి ఆయనే కారణం

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 13, 2019, 04:42 PM

సీనియర్ నటుడు మురళీ మోహన్ అప్పట్లో మరీ పెద్ద స్టార్ ఏమీ కాదు. మీడియం రేంజ్ హీరోనే. ఐతే తెలుగు సినిమాలో ఎంతో వైభవం చూసిన నటులు, టెక్నీషియన్ల కంటే కూడా ఆర్థికంగా మురళీ మోహన్ ఎంతో ఎత్తులో ఉంటారు. ఆయన వేల కోట్లకు అధిపతి. సినీ రంగంలో సంపాదించిన డబ్బుల్ని తెలివిగా భూమిపై పెట్టుబడిగా పెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎవ్వరూ ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదించాడాయన.

ఐతే నిర్మాణంలోకి వచ్చి సాహసాలు చేస్తున్న తనను రియల్ ఎస్టేట్ వైపు మళ్లించి తన రాత మార్చిన ఘనత శోభన్ బాబుకే దక్కుతుందని అంటున్నాడు మురళీ మోహన్. తాను ఇంత డబ్బులు సంపాదించడానికే శోభన్ బాబే కారణమంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడాయన.

‘‘వయసు పైబడ్డాక కుర్రాడిలా నటించడం, అమ్మాయిలతో డ్యూయెట్లు పాడటం కరెక్ట్ కాదనిపించి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశా. మా బేనర్లో 25 సినిమాలు చేశాం.  సినిమాలు పంపిణీ కూడా చేశా. వేరే వాళ్లను నమ్మి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా పెట్టా. కానీ అవి నా కొంప ముంచాయి. పెట్టిన పెట్టుబడి పోగా.. నా భాగస్వాములు చనిపోవడంతో వారి అప్పులు కూడా నేనే కట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో శోభన్ బాబు నన్ను ముందే హెచ్చరించారు.

నేను నష్టపోయిన తర్వాత కలిస్తే.. ఆయన ఒక మాట అన్నారు. ‘ఈ ప్రపంచంలో మూడు వంతుల సముద్రం, ఒక వంతు భూమి ఉంది. కాబట్టి భవిష్యత్తులో భూమికి డిమాండ్‌ పెరుగుతుంది. దానిపై పెట్టుబడి పెడితే డబ్బులు ఎక్కడికీ పోవు’ అని చెప్పారు. ఆ సలహా నచ్చి చెన్నైలో  స్థలాలు కొన్నా. తర్వాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు మారడంతో అక్కడ స్థలాలు అమ్మి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టా. ముందు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ తర్వాత నిలదొక్కుకున్నా’’ అని మురళీ మోహన్ తన విజయగాథ గురించి చెప్పారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa