ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్యారడైజ్' తర్వాతే చిరంజీవి సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 03:03 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'దసరా' చిత్రంతో విశేష గుర్తింపు పొందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నటుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే, ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ నాని తాజాగా కీలక వివరాలు వెల్లడించారు.ప్రస్తుతం నాని తన స్వీయ నిర్మాణంలో వస్తున్న 'హిట్ 3' సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ గురించి ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై నాని స్పందిస్తూ, తాను ప్రస్తుతం 'ప్యారడైజ్' అనే మరో సినిమా చేయాల్సి ఉందని, దాని చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని నాని తెలిపారు. 'ప్యారడైజ్' సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి గారి ప్రాజెక్ట్ పనులు మొదలుపెడతామని నాని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ మెగా ప్రాజెక్ట్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'దసరా'తో తనదైన మార్క్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, టైటిల్ వంటి మరిన్ని అప్‌డేట్‌లను ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత వెల్లడిస్తామని నాని ఈ సందర్భంగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa