జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనపై సినీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. పహల్గామ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం తన పుట్టినరోజును పహల్గామ్లోనే జరుపుకున్నానని, అక్కడి స్థానిక ప్రజల ఆప్యాయత తనకెంతో నచ్చిందని విజయ్ దేవరకొండ తెలిపారు. నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకమని చెప్పారు. ఈ దారుణ ఘటన ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తోందని అన్నారు.పర్యాటకులపై కాల్పులు జరపడం దారుణమని విజయ్ చెప్పారు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నానని... ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితుల తరఫున నిలబడదామని, భారతదేశం ఎప్పటికీ తలవంచదని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడదామని విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా తెలిపారు.పహల్గామ్ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి, దాడిని ఖండించారు. బాధితుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa