ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనోళ్లే : విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 02:46 PM

పహల్గమ్‌ ఉగ్రమూక జరిపిన మారణకాండపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ రక్తపాతంపై స్పందించిన సినీ ప్రముఖులు తాజాగా రౌడీ హీరో..ఫ్యామిలీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి కారణమైన పాకిస్థాన్‌పై విజయ్‌ దేవరకొండ బహిరంగంగా విరుచుకుపడ్డారు. 'ఆ నా కొడుకుల్ని' అంటూ విజయ్‌ దాయాది దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి దేశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సూర్య నటించిన రెట్రో సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ పాకిస్థాన్‌ చేస్తున్న దాడులపై స్పందించారు. ప్రసంగం ప్రారంభంలోనే పహల్గమ్‌ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి అంజలి ఘటించారు. ఈ క్రమంలో హీరో సూర్యపై ప్రశంసలు కురిపించాడు. పేదలకు విద్య అవకాశాలపై 'అగరం ఫౌండేషన్‌' ద్వారా చేస్తున్న సేవను ప్రస్తావిస్తూ విజయ్‌ కీలక ప్రకటన చేశారు. తాను కూడా విద్యాపరంగా సేవ చేయాలని చూస్తున్నట్లు.. కొన్ని నెలల్లో అది ప్రకటిస్తానని చెప్పారు.


అనంతరం విద్య ప్రాముఖ్యం వివరిస్తూ విద్య లేకనే పాకిస్థాన్‌ దాడులకు తెగబడుతోందని హీరో విజయ్‌ దేవరకొండ మండిపడ్డారు. 'ఆ కొడుకులకు సరైన విద్య అందించాలి. ఇలా బ్రెయిన్‌ వాష్‌ కాకుండా ఏం సాధిస్తారో' అని పాకిస్థాన్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను చెబుతున్నా కశ్మీర్‌ ఇండియాదే. కశ్మీరీ ప్రజలు భారతదేశస్తులే' అని విజయ్‌ దేవరకొండ ప్రకటించారు. రెండు సంవత్సరాల కిందట 'ఖుషీ' సినిమా కశ్మీర్‌లో షూటింగ్‌ చేశాం. ఆ సమయంలో నాకు అక్కడ ఎంతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి' అని గుర్తుచేసుకున్నారు.'పాకిస్థాన్‌ వాళ్లు వాళ్ల ప్రజలనే చూసుకోకుండా.. అక్కడ కరెంట్‌ లేవు.. నీళ్లు లేవు. ఇక్కడకు వచ్చి ఏం చేయాలని చూస్తున్నారో' అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. 'పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేయాల్సిన పని లేదు. ఇలాగే కొనసాగితే పాకిస్థాన్‌ వాళ్లకే విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వంపై దాడి చేస్తారు' అని విజయ్‌ తెలిపారు. '500 సంవత్సరాల కిందట ఆదివాసీలు కొట్టుకున్నట్లు వీళ్లు బుద్ధి లేకుండా.. కనీస జ్ఞానం లేకుండా చేసే పనులు ఇవి' అని విమర్శించారు.


'మనం ఐక్యంగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి. అందరం ఐక్యంగా ముందుకుపోవాలి. విద్య అనేది ప్రధాన అంశం. మన ఇంట్లో మనం అందరం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంచాలి' అని ఫ్యామిలీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa