by Suryaa Desk | Mon, Aug 12, 2024, 08:13 PM
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో టూరిజం హబ్ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిని టూరిజం హబ్గా మార్చనున్నట్టు భట్టి విక్రమార్క ప్రకటించారు. మండల కేంద్రంలో ఉన్న బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం ఒకటో శతాబ్దం నాటిదని.. 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థూపం దక్షిణ భారతదేశంలోనే పెద్దదని భట్టి విక్రమార్క తెలిపారు. నేలకొండపల్లిలో బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్లో ఆనాటికి సంబంధించిన శిలలు ఉన్నాయని తెలిపారు. బౌద్ధ స్థూపాన్ని ఇండియాలనే ది బెస్ట్గా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు.
ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. అభివృద్ధికి కావల్సిన నిధులు మంజూరు చేస్తామని విక్రమార్క తెలిపారు. 10 కోట్లు కేటాయింపులతో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్తో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. బౌద్ధిస్తులతో కలిసి ఫెస్టివల్ పెట్టాలన్నారు. పాశ్చాత్య దేశాల్లో.. ప్రతి వారంలో రెండు రోజుల పాటు బుద్ధిజం బోధనలు చేస్తారని.. మనం కూడా వారానికి ఒక రోజు బుద్ధిజం పేరుతో పర్యాటించాలని భట్టి సూచించారు.
నేలకొండపల్లికి మరో ప్రత్యేకత కూడా ఉందని.. ఇది భక్తరామదాసు జన్మస్థలమని.. దీన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన పాలేరు రిజర్వాయర్ కూడా ఓ ప్రత్యేకత అని.. ఈ మూడింటిని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించొచ్చని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తుందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని.. ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇంతకాలం నేలకొండపల్లిని నిర్లక్ష్యం చేశారన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా.. బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏం చేయాలన్నది అధికారులు ప్రణాళికలు రచించాలని సూచించారు. స్థూపానికి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటుకి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలన్నారు. బౌద్ధ స్థలాలు తక్కువగా ఉన్నాయని.. తెలంగాణలో ఉన్న మూడు స్థలాలో పాలేరు కీలకమైందని వివరించారు.