మిషన్ భగీరథను సక్రమంగా నిర్వహించటం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. తాగునీళ్లు లేక ప్రజలు, సాగునీళ్లందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మట్లాడిన ఆయన.. ఇది ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చిన కరువు కాదని, అసమర్ధ కాంగ్రెస్ వల్ల వచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఉన్నా వినియోగించకోటం ఈ ప్రభుత్వానికి చేతకవాడం లేదన్నారు. ఫోన్ట్యాపింగ్ మీద కాకుండా వాటర్ ట్యాప్ మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. చేరికల కోసం పార్టీ గేట్లు ఎత్తడం కాకుండా.. రైతుల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.
సాగర్, సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లో నీళ్లు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. చుట్టూ నీళ్లు ఉండగా హైదరాబాద్ వాసులు ఎందుకు ట్యాంకర్లతో నీటిని కొంటున్నారని ప్రశ్నించారు. మీకు ఓటు వేయలేదని నగర ప్రజలపై కక్ష కట్టారా ? అని నిలదీశారు. సాగర్ నుంచి 14 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉందని.. ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి కూడా లేదని దుయ్యబట్టారు. సాగు నీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేశారని.. కాళేశ్వరం నుంచి జల పరవళ్లు తొక్కుతున్నా ప్రభుత్వానికి సోయి లేదన్నారు. పంటలు ఎండిపోవాలనేదే కాంగ్రెస్ ఉద్దేశమని.. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఇలాంటి కుట్రలకు తేరలేపారని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదు. తాను ఎవరినో హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారని అదంతా అవాస్తమన్నారు. తనకు ఏ హీరోయిన్తోనూ సంబంధం లేదని చెప్పారు. తన క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ వ్యవహారానికి తనుకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ మళ్లీ చెబుతున్నానని వ్యాఖ్యానించారు అలాగే అనవసర ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని.. తాను ఎవరికీ భయడనని వార్నింగ్ ఇచ్చారు. మంత్రైనా.. ముఖ్యమంత్రైనా తాటతీస్తామన్నారు.
పార్టీ ఫిరాయింపులపైనా స్పందించిన కేటీఆర్.. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి.. మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై కచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు. స్టేషన్ ఘన్పూర్, ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రావటం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa