దేవాలయంలో చోరీకి యత్నించాడో దొంగ. గుడి మూసేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా లోపలికి ప్రవేశించాడు. అమ్మవారి గర్భగుడి ముందున్న హుండీలో డబ్బులు దొంగిలించేందుకు ట్రై చేశాడు. అలా హుండీ లోపలికి చేయి పెట్టాడో లేదో.. దొంగకు ఊహించని షాక్ తగిలింది. చేతి నిండా డబ్బులు చిక్కాయి గానీ.. చేయి బయటకు రావటం లేదు. ఎంత ప్రయత్నించినా.. చేయి మాత్రం బయటకు రాలేదు. దీంతో దొంగ రాత్రంతా హుండీలోనే చేయి ఇరుక్కుపోయి అలాగే ఉండిపోయాడు. ఉదయం దేవాలయం తలుపులు తెరిచిన పూజారి.. దొంగను గమనించి గ్రామస్థులకు విషయం చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలోని పోచమ్మ ఆలయంలో గతరాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. ఆలయంలో పనిచేసే సురేష్ అనే వ్యక్తే ఈ చోరీకి ట్రై చేసాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో గుడిలోకి ప్రవేశించి హుండీలో డబ్బులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. హుండీలో చేయిపెట్టి అందిన కాడికి డబ్బులు చేతబట్టుకున్నాడు. అయితే అనుకోని విధంగా చేయి హుండీలోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అధి బయటకు రాలేదు. దీంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు దాదాపు 8 గంటలు నరకయాతన అనుభవించాడు.
ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి దొంగను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడుకు చేరుకున్న గ్రామస్తులు సురేష్ను పట్టుకున్నారు. హుండీ తాళాలు తీసి అతడి చేయిని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. సురేష్ చేయి అందులో ఇరుక్కుపోవటానికి అమ్మవారే కారణమని స్థానికులు అంటున్నారు. అమ్మ మహత్యం వల్లే హుండీలో ఒక్క రూపాయి కూడా చోరీ కాలేదని చెబుతున్నారు. దొంగకు అమ్మవారు శిక్ష విధించిందని అందుకే రాత్రంత చేయి అందులో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa