ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని అట్లాంటాలో రూ.300 కోట్లతో భద్రాద్రి తరహా రామాలయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 09:58 PM

అమెరికాలోనూ భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహా ఆలయ నిర్మాణం మొదలైంది. అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు పద్మనాభాచార్యలు వివరించారు. ఆలయంలో ఏర్పాటుచేసే శిల్పాలను ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారుచేయిస్తున్నారు.


పద్మనాభాచార్యలు తోటి అర్చకులతో కలిసి ఇక్కడ వచ్చారు. నంద్యాలలో పనులను పర్యవేక్షించారు. అలాగే, భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయ విడిభాగాలను మాత్రం ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నారని చెప్పారు.


ఆళ్లగడ్డలో శిల్పాలు చెక్కడం పూర్తయ్యాక అట్లాంటా ప్రాంతానికి విడిభాగాలను విమానంలో తరలించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 17న ఖగోళయాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామని, సెప్టెంబరు 17 వరకు ఈ యాత్ర సాగుతుందని ఆయన వివరించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, కాలిఫోర్నియా, ఐస్‌లాండ్‌, జపాన్‌, అలస్కా వంటి దేశాలకు విగ్రహాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి శాంతి కళ్యాణాలను నిర్వహిస్తామని పద్మనాభాచార్యులు తెలియజేశారు. 2016 జనవరిలో రామాలయ నిర్మాణం తలంపు వచ్చినట్టు తెలిపారు.


ఈ దివ్యమైన ఆలోచన తన శ్రేయోభిలాషులతో పంచుకుని, చర్చించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి భారత్‌కు వచ్చానని తెలిపారు. తొమ్మిది మంది వేద పండితుల బృందంతో కలిసి భద్రాచలం నుంచి పరివారంతో ప్రయాణాన్ని ప్రారంభించి, 48 రోజుల్లో భారత్, నేపాల్‌లోని 108 దివ్య దేవాలయాలను సందర్వించినట్టు పేర్కొన్నారు. అనంతరం అమెరికాకు చేరుకుని కమ్మింగ్‌లో భద్రాద్రి తరహా శ్రీరామ మందిరం నిర్మించాలనే ఆలోచనతో 1008 కళ్యాణాలను జరిపించే దివ్య సంకల్పం ప్రారంభించినట్టు చెప్పారు. మే 10, 2018 (హనుమ జయంతి రోజు) నాడు ఆలయ నిర్మాణానికి 33 ఎకరాల భూమి లభించిందని వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa