ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తవ్వకాల్లో బయటపడిన పురాతన నాణేలు.. కుండలో ఏకంగా 3,730 ఉన్నాయి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 10:10 PM

సూర్యాపేట జిల్లాలో పురాతన నాణేలు బయటపడ్డాయి. నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో భారీగా పురాతన నాణేలు బయటపడ్డాయి. రాష్ట్ర చరిత్ర, వారసత్వ సంపదశాఖ డైరెక్టర్‌ భారతిహోలికేరి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతతో కలిసి రాష్ట్ర పురావస్తుశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌ గురువారం వాటిని పరిశీలించారు. ఆ నాణేలను ప్రదర్శించిన అనంతరం శైలజారామయ్యర్‌ వివరాలు తెలిపారు.


ఇటీవల బౌద్ధ క్షేత్రంలో తవ్వకాలు జరపగా ఓ కుండ బయటపడిందన్నారు శైలజారామయ్యర్. అందులో 3,730 సీసపు నాణేలు ఉన్నాయని.. దానికి సమీపంలోనే గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగల ఆకృతులు, అప్పట్లో పిల్లలు ఆడుకునే బండి చక్రం వంటివీ లభ్యమైనట్లు తెలిపారు. ఆ సీసపు నాణేలు ఇక్ష్వాకుల కాలం నాటివిగా గుర్తించారని.. ఒకేచోట ఇంత పెద్ద మొత్తంలో నాణేలు దొరకడం దేశంలోనే మొదటిసారి అంటున్నారు.


బౌద్ధ చరిత్రను వెలికితీయడంలో ఇది గొప్ప మైలురాయి వంటిది అన్నారు శైలజారామయ్యర్. ఈ పరిణామంతో ఫణిగిరి గ్రామం ప్రపంచ పటంలోకి ఎక్కినట్లయిందని వెల్లడించారు. బౌద్ధక్షేత్రంలో నిజాం కాలంలోనే చారిత్రక ఆనవాళ్లనూ గుర్తించామన్నారు భారతి హోలికేరి. ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకుల దృష్టి ఫణిగిరిపై పడిందని అన్నారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రాల్లో ఫణిగిరి క్షేత్రం ఒకటి. అమరావతి, నాగార్జునకొండ బౌద్ధక్షేత్రాల కంటే ఈ క్షేత్రం గొప్పదంటారు. ఇక్కడ ఇక్ష్వాకులు 11 ఏళ్లు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1941లో అప్పటి నైజాం ప్రభువు కాలంలో ఈ క్షేత్రంలో తొలిసారి తవ్వకాలు జరిపారంటున్నారు. ఆ తర్వాత రాష్ట్ర పురావస్తు శాఖ వారు 2001 నుంచి 2007 వరకు ఒకసారి 2015లోనూ ఫణిగిరి గుట్టపై తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మహాస్థూపం, చైతన్య గుహలు, స్థూపాలు, గృహలు, శిలా మండపాలు, బుద్ధుడి పాదాలు, బుద్ధడి ప్రతిమలు, పాత్రలు, చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతమి జీవిత కథలు, అపురూపంగా మల్చిన శిల్పాలు, శాతవాహలు, ఇక్ష్వాకులు, మహాతరవరుల నాణాలు, బొమ్మలు బయటపడ్డాయి.


కుండలు, కూజాలు, కప్పులు, టైల్స్‌, బౌద్ధుల గదులు బయటపడ్డాయి. ఇందులో 32 గదులు ఉన్నాయి. బుద్ధుడి పాదాలు, బుద్ధుడి వ్యక్తిత్వానికి ప్రతీకలుగా భావించే అష్టమంగళం, చిహ్నాలు, మర్మచక్రం, మిఽథునం, అంకుశం, యజ్ఞాశం, ఖడ్గం, సప్తి, పిరస్నం గుర్తులు లభించాయి. ప్రపంచంలో ఎక్కడా లేని బుద్ధుడి తలపాగా ఇక్కడ లభ్యమైందని చెబుతారు. గతంలో ఇక్కడ బుద్ధవనం ప్రాజెక్ట్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. తరచుగా దేశ, విదేశాల బౌద్ధ మత గురువులు, పురావస్తు పరిశోధకులు, అధ్యయనకారులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.


మార్చి 11న ఈ బౌద్ధక్షేత్రంలో మ్యూజియం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఆ రోజు నుంచి పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ మరోసారి తవ్వకాలు చేపట్టారు. రోజూ 65 నుంచి 75 మంది కూలీలు తవ్వకాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం సెలవు రోజు తప్ప మిగతా రోజుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో 3,700 సీసపు నాణేలు బయటపడ్డాయి. వాటిని కూలీల సమక్షంలోనే లెక్కించి భద్రపరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa