ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ మెసేజ్‌కు టెంప్ట్ అయ్యాడు.. రూ. 34 లక్షలు పోగొట్టుకున్నాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 04:01 PM

ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. విలువైన బహుమతులు, ఈ కేవైసీ, క్రెడిట్ కార్డులతో పాటు వాట్సాప్‌లకు లింకులు పంపించి బురిడీ కొట్టుస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌కు స్టాక్ మార్కెట్ పేరిట లింకులు పంపించి రూ. 34 లక్షలు కొట్టేశారు. మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి (52)కి స్టాక్‌ ట్రేడింగ్‌ సలహాలిస్తామంటూ ఇటీవల వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. దీంతో టెంప్ట్ అయిన సదరు వ్యక్తి ఆ నంబరులో సంప్రదించగా.. సైబర్‌ నేరగాళ్లు అతడ్ని దాదాపు 200 మంది ఉన్న వాట్సాప్‌ గ్రూపులో యాడ్ చేశారు. LKPSL యాప్‌ ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయాలని సూచించగా.. బాధితుడు అలాగే చేశాడు. తర్వాత పుల్‌అప్‌షేర్లు కొనుగోలు చేయించి, కొంతమేర లాభం వచ్చినట్లు నమ్మించారు.


బాధితుడి అనుమతి లేకుండానే రూ.1.26 లక్షల విలువైన 1500 షేర్లను అతని పేరిట బదలాయించారు. ఆ తర్వాత మరో 10వేల షేర్లు బదిలీ చేసి రూ.20 లక్షల లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. ఆ తర్వాత రూ.34 లక్షల విలువైన షేర్లను కొనిపించారు. ఆ తర్వాత షేర్లు విక్రయించేందుకు ట్రై చేయగా.. కుదరలేదు. సైబర్‌ నేరగాళ్లను కాంటాక్ట్ చేసినా ఫలితం లేదు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa