హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు రైడ్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం (మే 21) ఉదయం హైదరాబాద్ అశోక్నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్లుగా తేల్చగా.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారుల అంచనా.
ఇక ఈ కేసులో ఉమామహేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులను ఏసీపీ బెదిరించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని.. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. అయినా తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు.. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లు గుర్తించారు. సీసీఎస్లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉండి.. వారితోనే బేరసారాలు ఆడినట్లు తెలిసింది.
గతంలో ఫిర్యాదు చేయడానికివచ్చిన ఒక ఎన్నారైను సైతం బెదిరించి ఏసీపీ డబ్బులు దండుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో 5, అశోక్ నగర్లో 4 ఫ్లాట్ గుర్తించామన్నారు. శామీర్ పేట్లో 1, కూకట్పల్లిలో 1 మల్కాజ్గిరి 1 ప్రాపర్టీ గుర్తించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. ఏపీలోని వైజాగ్, చోడవరంలోనూ భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును తన ఇంట్లో ఉంచకుండా అత్త మామల ఇంట్లో దాచినట్లు తేలింది. కాగా, ఉమామహేశ్వర్ రావుని నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa