ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో రైతు రుణ మాఫీ.. ఆ రెండు అంశాలపై ప్రధానంగా కసరత్తు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 07:32 PM

తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 15లోపు రుణాలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. రుణమాఫీకి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే.. ఆ నిర్ణయానికి తగిన విధంగా రుణమాఫీ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రుణమాఫీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీ ఇచ్చారు.


 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని స్పష్టత ఇచ్చారు. ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్ని ప్రభుత్వం నిర్ధేశించి.. రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లను కూడా సంప్రదించారు. ఆ దిశగానే రుణాలను మాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందించే పనిలో ఉంది ప్రభుత్వం. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తికాగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మార్గదర్శకాలను వెంటనే విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది.


ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన ప్రధానంగా అర్హతలపైనా క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరెవరికి వర్తింపజేస్తారు.. గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేశారు.. ఈ అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని.. రెన్యువల్ చేసుకోలేదు. మరి వారికి మాఫీ వర్తిస్తుందా అన్నది చూడాలి. ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థికశాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఆయా బ్యాంకుల బ్రాంచీలు పంట రుణాల జాబితాలను తయారు చేసే పనిలో ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అవి రాగానే ఎవరెవరు రుణమాఫీకి అర్హులు అనేది క్లారిటీ వస్తుంది.


తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని చెబుతోంది. ఈ మేరకు వివిధ ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. అలాగే ప్రధానంగా రైతుల రుణ మాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. వివిధ మార్గాలను పరిశీలిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa