గత వారం పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వేసవి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. మే నెల ముఖ్యంగా కార్తెల్లో ఎండలు ఎలా ఉంటాయోనని జనం భయపడిపోయారు. కానీ, అనూహ్యంగా మే రెండో వారం నుంచి వాతావరణం చల్లబడి వరుణుడు కరుణించాడు. దీంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. మళ్లీ రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా.. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వానలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. గురువారం అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేర్ మండలంలో 6.2 సెం.మీటర్ల వర్షపాతం.. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్లో 5.2, యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో 3.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 3.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలతోపాటు హైదరాబాద్ నగర పరిధిలో ఉప్పల్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
మరోవైపు, పలు జిల్లాల్లో గురువారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 43.1, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, కడెం పెద్దూరు మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా బోధన్ కల్దుర్కిలలో 42.9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో గరిష్టంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa