ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌.. హైదరాబాద్ డాక్టర్ ప్రధాని సూత్రధారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 07:23 PM

కొచ్చిలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు కాగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్‌ను ప్రధాన సూత్రధారిగా కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న సబిత్‌ నాసిర్‌ అనే యువకుడు పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దందా నడిపిస్తున్నారని, వారిలో ఒక వైద్యుడు ఉన్నాడని అతడు వెల్లడించాడు. దీంతో ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైదరాబాద్‌ చేరుకుంది. మిగతా ఇద్దరు బ్రోకర్లను గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.


బాధితులను ఇరాన్‌‌కు తీసుకెళ్లి.. కిడ్నీలు అమ్మించిన ఆ వైద్యుడు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక, తెలంగాణలకు చెందిన పేద యువకులను ఈ ముఠా ఇరాన్‌ తీసుకెళ్లి.. అక్కడ వారి కిడ్నీలను అమ్ముకుంటోంది. అయితే, బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌లో కీలక సభ్యుడు సబిత్‌ నాసిర్‌ను ఇరాన్‌ నుంచి కొచ్చికి వస్తుండగా ఆదివారం అతడ్ని ఎయిర్‌పోర్ట్‌లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.


కోర్టు రిమాండ్‌కు అనుమతించడంతో.. విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితుడు సబిత్‌ ఈ దందాలో చేరడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టరే ప్రధాన కారణమని తెలిసింది. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించిన సమయంలో డాక్టర్‌,సబిత్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి స్నేహితులైన ఈ ఇద్దరూ రాకెట్‌ను నడిపిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలనను విక్రయించినట్లు సబిత్‌ విచారణలో అంగీకరించాడు.


పేద కుటుంబాలకు చెందినవారిని గుర్తించి.. వారికి డబ్బులు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేందుకు ఒప్పుకునేలా చేస్తారు. ఇరాన్ వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్టు, వీసాల వంటివి వాళ్లే సమకూర్చుతారు. రక్తసంబంధీకులు కానివారు అవయవ దానం చేసేందుకు ఇరాన్‌లో అనుమతి ఉండటంతో అక్కడకి తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. డోనర్స్ కిడ్నీ ఎవరికి సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆస్పత్రిలో సర్జరీ జరుగుతుంది. అనంతరం 20 రోజులపాటు దాతను ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి.. కోలుకున్న తర్వాత వెనక్కి తీసుకొస్తారు. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశచూపి తీసుకెళ్లే ఈ ముఠా తీరా అన్ని లెక్కలు చూపించి.. చేతికి రూ.6 లక్షలు ఇస్తున్నారు.


మరోవైపు, ఈ రాకెట్‌ సూత్రధారిగా చెబుతున్న హైదరాబాద్‌ డాక్టర్ గురించి సబిత్‌ వెల్లడించిన వివరాలు స్పష్టంగా లేవని కేరళ పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా పట్టుబడినా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా అతడు తప్పుడు సమాచారం చెప్పి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్‌ తరలించగా.. వీరిలో హైదరాబాద్‌కు చెందిన యువకులు ఎక్కువగా ఉన్నట్టు దర్యాప్తులో సబిత్‌ వెల్లడించాడు. దీంతో ఆ యువకులు ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa