ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి కలకలంరేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం సముద్రంలో దొరికింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన బీజేపీ నేత (దివంగత) అరటి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు అరవింద్ యాదవ్ ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఏడాదిన్నర క్రితం అరవింద్కు వివాహంకాగా.. భార్య గర్భిణి. అయితే అరవింద్ తల్లి ఉషారాణి ఆస్ట్రేలియా రాగా.. అక్కడి వాతావరణం పడకపోవడంతో వారం క్రితం షాద్ నగర్ తిరిగి వచ్చేశారు. అరవింద్ కుటుంబంతో కలిసి సోమవారం (మే 20న) ఇంటికి (షాద్ నగర్) వచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాడు.
అరవింద్ కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు.. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో అరవింద్ మృతదేహం సముద్రంలో లభ్యమైంది.. అతడి కారు కూడా సమీపంలోనే గుర్తించారు. అయితే పోలీసులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అది అరవింద్ డెడ్బాడీ అని గుర్తించారు. అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.. అతడిది హత్యా?..ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అరవింద్ తండ్రి కృష్ణ యాదవ్ 2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్నగర్లో నివాసం ఉంటున్నారు. భర్త మరణం తర్వాత ఒక్కగానొక్క కుమారుడ్ని బాగా చదివించారు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి చేశారు. అరవింద్ జీవితంలో బాగా స్థిరపడ్డాడు అనుకుంటున్న సమయంలో ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa