ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఛార్జీలు, పెంపు ఎంతంటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 08:03 PM

హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. త్వరలోనే మీ జేబులకు చిల్లు పడనుంది. మెట్రో ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం. మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్‌ ధరలను పెంచేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ రెడీ అవుతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్ ధరలు పెంచాలని డిసైడ్ అయింది. హైదరాబాద్ మెట్రో... మూడు లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గ్యమస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళకు ఫ్రీ బస్సు జర్నీతో మెట్రోకు గతంతో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది. అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది. ప్రతి నెలూ రూ. 45 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 540 కోట్ల నష్టం వవ్తున్నట్లు ఎల్అండ్‌టీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది.


ప్రస్తుతం 2 కిలోమీటర్ల దూరానికి టికెట్‌ ధర రూ.10గా ఉంది. 2-4 కి.మీ దూరానికి రూ.15 టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. 4-6 కి.మీ. దూరానికి రూ.25.. 6-8 కి.మీ. దూరానికి రూ.30.. 8-10 కి.మీ. దూరానికి రూ.35.. 10-14 కి.మీ. దూరానికి రూ.40.. 14-18 కి.మీ. దూరానికి రూ.45.. 18-22 కి.మీ. దూరానికి రూ.50.. 22-26 కి.మీ. దూరానికి రూ.55.. 26 కిలోమీటర్లకు పైగా దూరానికి రూ.60 టికెట్ ధరగా వసూలు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ప్రారంభ టికెట్ ధర రూ.10 ఉండగా.. గరిష్ఠంగా రూ. 60 ఉంది. టికెట్ రేట్లు 5-10 శాతం పెంచి కనీస ధర రూ. రూ.20కి, గరిష్ఠ ధర రూ.80కి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మెట్రో ప్రారంభమైన సమయంలో అమల్లో ఉన్న ధరలే ఇప్పటికీ నడుస్తున్నాయి. ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను బేరీజు వేసుకొని ఛార్జీల ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం. ఛార్జీల పెంపుపై కేంద్ర ఫేర్ ఫిక్సేషన్‌ కమిటీకి హైదరాబాద్ మెట్రో అధికారులు గతంలోనే ప్రతిపాదనలు పంపారు. మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కూడా తీసుకున్నారు. తాజాగా కేంద్రంలో మరోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయటంతో త్వరలోనే ఛార్జీలు పెరగునున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa