ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కె. కేశవరావుకు కీలక పదవి.. కేబినెట్ హోదాతో, ఉత్తర్వులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 08:20 PM

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ సీనియర్ రాజకీయ నేత కె. కేశవరావుకు రేవంత్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన్ను నియమించారు. కేబినెట్ హోదాతో ఆయన్న పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేకేకు ఉన్న రాజకీయ, పరిపాలనపరమైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయన్ను సలహాదారుగా నియమించినట్లు తెలిసింది. కాగా, కేకే గతంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ను కేసీఆర్ రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ పదవికి కూడా కేకే రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ మనిషిని.. కాంగ్రెస్ తనకు సొంతిల్లు వంటిదని ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వెల్లడించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందు వల్ల నైతిక విలువలతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని అందుకే పార్టీ మారినట్లు తెలిపారు. కాగా, పార్టీ మార్పు సమయంలోనే ఆయనకు కీలక పదవి వస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే కేబినెట్ హోదాతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. కాగా, జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఉన్న ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మీ సైతం గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.


కాంగ్రెస్‌లో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa