ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 08:08 PM

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఆగస్టు 15 వ తేదీతో పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతుండగా.. రేవంత్ సర్కార్ అన్నీ దొంగ లెక్కలే చెబుతోందని ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.2 లక్షల రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ సక్సెస్ అయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయిందని చూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అమెరికా పర్యటన సక్సెస్ కాలేదని.. కానీ వాళ్ల కుటుంబ పర్యటన మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయిందంటూ కేటీఆర్ చురకలు అంటించారు.


రైతులకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తిగా మోసం చేసిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు ఎంత రుణమాఫీ చేసింది అని ఆయన ప్రశ్నించారు. ఇన్‌కమ్ టాక్స్ కట్టారని.. రేషన్ కార్డు లేదని చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పించాలని పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి రుణమాఫీ చేసింది నిజమే అయితే.. ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత గ్రామానికే మీడియాతో కలిసి వెళ్దామని అధికారులు, సెక్యూరిటీ లేకుండా కేవలం మీడియా, సీఎం, తాను మాత్రమే వెళ్దామని అన్నారు. ఒకవేళ ఆ గ్రామంలో 100 శాతం రుణమాఫీ అయిందని తేలితే.. అక్కడే రాజీనామా సమర్పిస్తానని తేల్చి చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రైతు రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న వేళ.. తాజాగా కేటీఆర్ మరో సవాల్ విసరడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa