తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చూట్టూనే తిరుగుతున్నాయి. అర్హులందరికీ రుణమాఫీ చేశామని.. కాంగ్రెస్ చెబుతుంటే రైతు రుణమాఫీ డొల్ల అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళన కు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి , తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడ్తున్న పాట్లు చూసి జాలి వేస్తుందన్నారు.
ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారని.. ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోను ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే చెయ్యని వారని బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వీరిద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే ఎటూ పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
బ్యాంకుల నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారులందరికి పథకాన్ని వర్తింప చేసామన్నారు. రూ.2 లక్షలలోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామన్నారు. అర్హత ఉన్నా.. రైతు రుణమాఫీ కాలేదనే టెన్షన్ రైతులు పడాల్సిన పనిలేదని చెప్పారు. రూ. 2 లక్షలపైన ఉన్న ఖాతాలకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన పిదప అర్హత బట్టి చెల్లిస్తామన్నారు.
బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటా తప్పుగా ఉన్న రైతుల వివరాలును కూడా సేకరిస్తున్నామని చెప్పారు. రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో ఉన్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఇకనైనా హుందాగా ప్రవర్తించి.. ప్రజల్లో తమ స్థాయిని కాపాడు కోవాలని హితవు పలికారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీకి రూ.31,000 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అర్హత ఉండి మాఫీ అందని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa