ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 07:56 PM

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం-హత్య కేసు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో జూనియర్ డాక్టర్‌ మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ ఘటన తరువాత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసి మహిళా డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమైన హాస్పిటల్స్‌లో షీ టీంలతో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించేలా నిబంధనలు రూపొందించాలన్నారు. తెలంగాణలోని అన్ని బోధనాసుపత్రుల్లో పర్మినెంట్ ప్రాతిపాదికన పోలీసు అవుట్‌పోస్టులను ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టంచేశారు.


గవర్నమెంట్ హాస్పిటల్స్ , మెడికల్ కాలేజీల్లో వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై సోమవారం (సెప్టెంబర్ 2) సెక్రటేరియట్‌లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం శాఖ కార్యదర్శి రవి గుప్తా, ఎస్పీఎఫ్‌ అదనపు డీజీ అనిల్‌ కుమార్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. షీ టీంలతో పెట్రోలింగ్ నిర్వహించటం ద్వారా.. వారిలో భరోసా కలుగుతుందని చెప్పారు. అలాగే రోగులకు కూడా మంచి జరుగుతుందని.. చిన్న పిల్లల కిడ్నాప్‌లు వంటివి అరికట్టవచ్చునని మంత్రి దామోదర వెల్లడించారు.


ఇక కోల్‌కతా ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను అరెస్టు చేసింది. హాస్పిటల్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇంతకు ముందు పోలీస్‌ పౌర వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ని అరెస్టు చేయగా.. ఇప్పుడిది రెండో అరెస్టు కావటం విశేషం. అనాథ శవాలను అమ్ముకోవడంతోపాటు హాస్పిటల్ టెండర్లలో ఘోష్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa