గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. రూల్స్కు భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్ధాక్ష్యిణంగా కూల్చేస్తున్నారు. నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లు ఆక్రమించిన చేపట్టిన కట్టడాలను కూల్చేశారు. ఇప్పటికే వందల నోటీసులు కూడా జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో బృహత్తర బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీకి ఛైర్మన్గా ఏవీ రంగనాథ్ను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ కమిటీ ఛైర్మన్గా హెచ్ఎండీఏ కమిషనర్ వ్యవహరించేవారు. చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకుగాను రంగనాథ్కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట.
ప్రస్తుతం హైడ్రా ఔటర్ రింగ్రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు హైడ్రాతోపాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కూడా రంగనాథ్కే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్టీఎల్ నిర్ధారణ, నోటిఫికేషన్ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో చెరువులు ఉండగా.. ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబరు 1 లోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్టీఎల్కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మెుత్తం 3,500 చెరువులు ఉండగా...ఇప్పటివరకు 265 చెరువులను నోటిఫై చేసినట్లు చెప్పారు. కాగా, హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు కూడా రంగనాథ్కే అప్పగించనున్నారనే సమాచారంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa