తెలంగాణలో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయంది. ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్సీఐ రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్ద తండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా ప్రజలను రక్షించే పని చేసినప్పటికీ దురదృష్టవశాత్తు 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నిరంతరాయంగా పనిచేయడం వల్లే ప్రాణ, ఆస్తినష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు.
వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. పాడి పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు. తాజా పరిస్థితులను ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వివరించామని, తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని అడిగిన విషయాన్ని సీఎం ప్రజలకు వివరించారు. తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని రూ.5,438 కోట్ల రూపాయాలు ఇవ్వాలని కోరామన్నారు. జరిగిన నష్టాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించాలని కోరినట్లు చెప్పారు.
జరిగిన నష్టంలో ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని... ప్రజలు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లలో బురద మిగిలింది. వాళ్లను ఆదుకోడానికి ఒక్క ఖమ్మంలో 34 క్యాంపులు 2,119 కుటుంబాల్లో 7,467 మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసిందన్నారు. రెస్క్యూ, రిపేర్, రిస్టోర్, రిపోర్టుతో జిల్లా యంత్రాంగం రాబోయే 5 రోజులూ కష్టపడి పనిచేయాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa