తెలంగాణను గత మూడ్రోజులుగా వణికించిన వానలు.. సోమవారం మాత్రం కాస్త తెరిపినిచ్చాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిశాయి. అయితే ఇక వర్షం ముప్పు వీడినట్లేనని అందరూ భావించగా.. తాజాగా హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
వచ్చే 24 గంటల్లో జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందస్తు ప్రణాళికతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. భారీ ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
నేడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి సూచించారు. కంట్రోల్ రూంలు 24 గంటలూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరో అల్పపీడన ముప్పు.. ఇక తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఈ నెల 5, 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తుపానుగా మారి.. విశాఖ, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు లేదా రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే హెచ్చరికలు ముంపు ప్రాంతాల ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa