హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఇద్దరు నర్సులు పాశవికంగా డెలివరీ చేశారు. ఫలితంగా పుట్టిన కాసేపటికే పండంటి బాబు మృతి చెందాడు. ఎవరైనా డెలివరీ చేతులతో చేస్తారు కానీ.. సాధారణ ప్రసవం కావట్లేదని గర్భాన్ని కాళ్లతో తొక్కి డెలివరీ చేయటం దారుణమైన విషయం. అసలు నర్సులు డెలివరీ చేయటమే ఆలోచించాల్సిన విషయమంటే.. అది కూడా ఏమాత్రం అవగాహన లేకుండా.. గర్భిణి ప్రాణాలు, లోపల ఉన్న శిశువు ప్రాణాలు ఎంతమాత్రమూ లెక్క చేయకుండా.. ఆటవికంగా కాళ్లతో తొక్కుతూ ప్రసవం చేయటం శోచనీయం.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రం పోడు తండాకు చెందిన రేణుకకు.. పురిటి నొప్పులు రావడంతో ఆదివారం (సెప్టెంబర్ 15న) రోజున హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. ఆదివారం ఉదయం నుంచి తన భార్య నొప్పులతో బాధపడుతున్నా.. డాక్టర్లు పట్టించుకోకపోవడంతో.. భర్త నిలదీశాడు. అయినప్పటికీ వైద్యులు ఏమాత్రం స్పందించలేదు. సోమవారం ఉదయం ఇద్దరు నర్సులు రంగంలోకి దిగి.. రేణుకకు డెలివరీ చేశారు.
రేణుకకు సాధారణ ప్రసవం చేసేందుకు నర్సులు ప్రయత్నించారు. ఎంతకూ డెలివరీ కాకపోవడంతో నర్సులు.. కాలుతో పొట్టను తొక్కారు. దీంతో.. బాబు బయటకు వచ్చాడు. కానీ.. పురుడు పోసుకున్న కాసేపటికే బాబు పరిస్థితి విషమించడంతో.. హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు.
దీంతో.. తొమ్మిది నెలల పాటు తమ సంతానం కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ దంపతులు గుండెలు పగిలేలా రోధించారు. వైద్యులు పట్టించుకోకపోవటం, నర్సులు అనుసరించిన ఆటవిక పద్ధతితోనే తమ బాబు మరణించాడని.. కుటుంబ సభ్యులు హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గర్భాన్ని ప్రాణాలు పోసే గర్భగుడిలా భావించి.. తొమ్మిది నెలల పాటు సున్నితంగా, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే.. దాన్ని కాళ్లతో తొక్కి డెలివరీ చేసే విధానం చూస్తుంటే.. అసలు వీళ్లు ఎలాంటి నర్సులు అన్న అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు.. వైద్యం మీద ఏమాత్రం అహగాహన లేని ఆర్టీసీ కండక్టర్లు, మిగితా మహిళలు.. పురిటి నొప్పులు పడుతున్న గర్భిణీలకు పురుడు పోసి.. పండంటి బిడ్డల ప్రాణాలు కాపాడుతుంటే.. నిత్యం వైద్యం చేస్తూ ఏమాత్రం అవగాహన లేకుండా ఆటవికంగా ప్రవర్తించి.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య సిబ్బందిని ఏమనాలో అర్థంకాని పరిస్థితి. అలాగని.. అందరు వైద్యులు అలాగే చేస్తున్నారని కాదు. కొంత మంది చేస్తున్న ఇలాంటి పనుల వల్ల విలువైన ప్రాణాలు పోతుండటంతో.. జనాల్లో అసహనం పెరిగిపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa