ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. నగర శివారు ప్రాంతాలు, తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ దోపిడీలు చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ శివారులో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో రూ.2 కోట్లకు పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది. ఉప్పల్ పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరి జరిగింది.
మక్త గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో దొంగలు రెండు కోట్ల నగద తో పాటు భారీగా నగలు ఎత్తుకెళ్లారు. నాగభూషణం ఉదయం పాల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.రెండు కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్టీం సాయంతో విచారణ చేపట్టారు. తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగభూషణం వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రెండ్రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని పంజేశా కాలనీలో నివాసం ఉండే బొంబడిపల్లి నరేష్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. నరేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 14న హైదరాబాద్ నగరానికి ఓ శుభకార్యం నిమిత్తం వెళ్లారు. ఆ మరుసటి రోజు తిరిగి వచ్చి చూడగా.. ఇంటి తాళం పగిలి ఉండటం గమనించారు. ఆందోళనకు గురైన నరేష్ ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువా ఓపెన్ చేసి ఉంది.
బీరువాలోని 12 తులాల బంగారం, అర కిలో వెండి నగలతో పాటు అందులోని రూ.40 వేల నగదు చోరీకి గురైంది. వెంటనే నరేష్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేలి ముద్రలను సేకరించారు. అక్కడున్న సిసి ఫుటేజ్లను పరిశీలించారు. తర్వలోనే దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa