హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే. మూసీనదిని పర్యాటక కేంద్రంగా, సంపదను సృష్టించే రహదారుల వారధిగా తీర్చిదిద్దేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ నదిని అందంగా సుందరీకరించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో భారీగా నిర్మాణాలు ఉన్నాయి. కొందరు మూసీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఆయా నిర్మాణాలను తొలగిస్తేనే మూసీ సుందరకీరణకు వీలు ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్మాణాలను తొలగించాలని భావిస్తోంది. ఆయా నిర్మాణదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైంది. మొదటి దశలో రెండువేల మందికి రెండు పడకల ఇండ్లు ఇచ్చేందుకు అధికారులు వివిధ ప్రాంతాల్లోని రెండు పడకల ఇళ్లను ఇటీవల పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వారికి ఇండ్లు కేటాయించనున్నారు. ఇక మంచిరేవుల నుంచి ప్రతాపసింగారం వరకు దాదాపుగా 55కి.మీ పొడవున మూసీ నదిపై ఇటీవల ఎంఆర్డీసీఎల్ (మూసీ నది అభివృద్ధి సంస్థ) పూర్తిస్థాయి సర్వే నిర్వహించింది.
మూసీ నదీగర్భంలో 2,166 ఇండ్లు, బఫర్జోన్లో 7,851 ఇండ్లు కలిపి మొత్తంగా 10,017 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా నిర్మాణాలను తొలగిస్తేనే మూసీ అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూసీ నది పూర్తిస్థాయి బృహత్తర ప్రణాళికను రూపొందించే పనులను ప్రభుత్వం మెుదలుపెట్టింది. ఆ పనులకు సమాంతరంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాలను ఖాళీ చేయించి, బాధితులకు పునరావాసం కల్పించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలి విడతలో రెండు వేల మందికి, మెుత్తంగా 10 వేల మందికి పైగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఇక మూసీ నది పరిహహక ప్రాంతాల్లో కూల్చివేతలను హైడ్రాకు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నేటి నుంచి కూల్చివేతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఆయా నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa