తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతోంది. మరో రెండు నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసిన వారు అవుతారు.ఇప్పటివరకు పాలన మీదా.. తానుముఖ్యమంత్రిగా కుదురుకోవటం మీదనే ఫోకస్ చేసిన ఆయన.. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద ద్రష్టి పెట్టారా? అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్లే తనదైన శైలిలో ఎమ్మెల్యేలకు సిం'ఫుల్' వార్నింగ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల టీపీసీసీ కొత్త రథసారధిగా ఎంపికైన మహేశ్ కుమార్ గౌడ్ ను సన్మానించేందుకు హైదరాబాద్ మహానగరంలోని ఒక స్టార్ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
'మన ఎమ్మెల్యేలు బాధ్యతతో మెలగాలి. అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు.. ఇతర విషయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవటంతో వారిని ప్రజలు ఓడించారు. మన ఎమ్మెల్యేలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేలు సచివాలయానికి గుంపులు గుంపులుగా రావొద్దు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండండి. పని చేయండి. అప్పుడే వారు మరోసారి గెలిపిస్తారు'' అని వ్యాఖ్యానించటం గమనార్హం.
పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని.. వారంతా జాగ్రత్తగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్.. 'ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయాన్ని కేటాయించాలి. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తాం. ఈ కార్డు ఆధారంగానే సదరు కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయి'' అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నంచి ఇప్పటివరకు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శల్ని తిప్పి కొట్టే విధంగా కాంగ్రెస్ నేతలు పని చేయట్లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించటం గమనార్హం. ''ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పి కొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి పదవులువస్తాయి. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం. అధికారం కోల్పోయిన ప్రతిపక్షం అసహనంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది. పార్టీ నేతలు వాటిని తిప్పి కొట్టాలి. ఇంచార్జి మంత్రులు వారానికి రెండుసార్లు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలి. వచ్చే ఎన్నికల్లో నాలుగోసారి గెలిచి అధికారంలోకి వచ్చేందుకు జమిలి ఎన్నికల్ని మోడీ తీసుకొస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి'' అంటూ హెచ్చరించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకుతాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్న ముఖ్యమంత్రి.. ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాల్ని ప్రజల్లోకి ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 27 రోజుల్లో రూ.18వేల కోట్ల మేరకు రైతుల రుణాల్ని మాఫీ చేశామన్న రేవంత్.. ''ప్రభుత్వానికి ప్రతి నెలా 18వేల కోట్ల ఆదాయం వస్తోంది.ఇందులో జీతభతయాలు.. అప్పుల వాయిదాలు.. వడ్డీలకే రూ.12వేలకోట్లు పోతున్నాయి. మిగిలిన రూ.6వేల కోట్లతోనే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించాం'' అంటూ తమ ప్రభుత్వం చేస్తున్న కసరత్తును చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa