ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌కార్డు లబ్ధిదారులకు తీపి కబురు.. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 10:06 PM

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో రేషన్ కార్డులు మంజూరు కాకపోటవంతో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు, కుటుంబాలు వేరు పడిన వారు రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది.


తాజాగా.. రేషన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ మరో తీపి కబురు చెప్పారు. రేషన్‌కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా.. సరకులను రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అంటే మీ స్వస్థలం ఎక్కడ ఉన్నా సరే.. ప్రస్తుతం మీరున్న చోటే రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారున్న చోటే సరుకులు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజా పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందించనున్నట్లు చెప్పారు.


ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్.. త్వరలోనే ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. రేషన్ కార్డులతో లింక్ లేకుండా నేరుగా హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై కూడా సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా జనాభాను లెక్కించాల్సిన అసరం ఉందన్నారు. బీసీ కులగణన చేయాలన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచనగా వెల్లడించారు. ఆ మేరకు రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ను, సభ్యులను నియమించామని తెలిపారు.


బీసీలకు రిజర్వేషన్లు దక్కాలంటే కచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకోసమే జమిలి ఎన్నికల పేరుతో హైడ్రామా మెుదలుపెట్టారన్నారు. దీనిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa