కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక ఊడిందన్నట్లు తయారైంది ఓ వృద్ధుడి పరిస్థితి. చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేసి కన్ను పోగొట్టారు. ఆ తర్వాత కాళ్ల బేరానికి వచ్చి రూ. 4 లక్షలు పరిహారం ఇచ్చారు. ఈ ఘటన మహబూబ్నగర్జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన రాములు కంటి చూపు మందగించింది. దీంతో గ్రామంలోనే ఉన్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ను సంప్రదించాడు. అతను షాద్నగర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలికి రిఫర్ చేశాడు.
దీంతో రాములు సదరు ప్రైవేటు హాస్పటల్ పరీక్షలు చేయించుకోగా.. కంట్లో పొర వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ చేస్తే చూపు క్లియర్గా ఉంటుందని అన్నారు. దీంతో రాములు ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధం కాగా.. జులైలో కాట్రాక్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత రాములు కంటిని పరీక్షించిన డాక్టర్లు.. లోపాన్ని గుర్తించి హైదరాబాద్లో మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా సర్జరీ చేయించి ఇంటికి పంపారు. ఆపరేషన్ జరిగి మూడు నెలలు గడిచినా రాములు కంటి నొప్పి తగ్గలేదు. పైగా చూపు రాకపోగా.. ఉన్న చూపు మెుత్తం పోయింది. వెంటనే రాములు హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు.
టెస్టులు చేసిన డాక్టర్లు కంట్లో ఉండే గ్లాకోమా, రెటీనా రెండు కత్తిరించారని బాధితుడి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో రాములు కుటుంబ సభ్యులతో పాటుగా అతని బంధువులు షాద్నగర్లో సదరు ప్రైవేటు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే కన్ను పోయిందని నిరసన వ్యక్తం చేశారు. తొలుత తమ తప్పిదం ఏం లేదని బుకాయించిన హాస్పిటల్ యాజమాన్యం.. ఆ తర్వాత బాధిత కుటుంబ సభ్యులతో కాళ్ల బేరానికి దిగింది. వైద్యం వికటించినందుకు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. రూ.4 లక్షలను బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత నిర్లక్ష్యంగా వైద్యం ఎలా చేస్తారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa