ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ భవన్‌కు 'హైడ్రా' బాధితులు క్యూ.. కంటతడి పెట్టుకున్న హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 06:05 PM

గ్రేటర్ హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో ఆవేదనకు గురవుతున్న పలువురు బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. పలువురు బాధితులు మత గోడును చెప్పుకునేందుకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న బాధితులు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ముందు తమ బాధలు చెప్పుకొన్నారు. 'ఆంధ్ర నుంచి వచ్చి పదేండ్ల క్రితం హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్‌లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు. ఇంకా పదేండ్లు ఈఎంఐ లు ఉన్నాయి.. ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అని ఓ బాధితురాలు కంటతడి పెట్టుకున్నారు.


 ఉమ్మడి ఏపీలోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని బాధితులు వెల్లడించారు. ఇప్పుడు సడెన్‌గా కూల్చేస్తామనడం సరికాదని అంటున్నారు. తమకు పర్మిషన్లు ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన ఎటువంటి ప్రయోజనం లేదని.. బీఆర్ఎస్ నేతలకు తమ గోడును వెల్లబోసుకునేందుకు ఇక్కడకు వచ్చామని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే తాము కష్టపడి సంపాదించిన జీతం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని.. ఇలా అక్రమంగా ఇండ్లు కూల్చేయటం మాత్రం సరికాదని వాపోయారు. హైడ్రా అధికారులు తమ నిర్మాణాలు ఎప్పుడు కూలుస్తారో అని నిద్ర కూడా లేకుండా కాలం వెల్లదీస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆవేదన విన్న హరీష్ రావు సైతం కంటతడి పెట్టుకున్నారు.


అనంతరం హైడ్రా బాధితులకు ధైర్యం చెప్పిన హరీష్ రావు.. తమ ఎమ్మెల్యేల బృందంతో బాధితుల ఇళ్లను సందర్శిస్తామని అన్నారు. బీఆర్ఎస్ లీగల్‌ సెల్‌ నుంచి వారికి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలి కానీ.. వారి గోసలు కాదని మండిపడ్డారు. హైదరాబాద్‌ నగర ఖ్యాతిని సీఎం రేవంత్‌ రెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చి.. పేదల ఇండ్లను మాత్రం బుల్డోజర్లతో కూల్చటమేంటని ప్రశ్నించారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయటం ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..తాము హైడ్రా బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. బాధితుల వద్దకు బుల్డోజర్లు వస్తే వాటికంటే ముందు తామే అక్కడకు వస్తామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa