ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 08:50 PM

వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి. ఆ రిజర్వ్ ఫారెస్ట్‌కు ఎవరైనా వచ్చి ఆ గాలిని పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని స్థానికులు అంటుంటారు. దామగుండం వెళ్తే యమగండం పోతుందని ఓ నానుడి కూడా ఉంది. అంతటి చరిత్ర గల దామగుండం ఫారెస్ట్‌పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. దామగుండం ఫారెస్ట్‌లో తూర్పు నౌకాదళ రాడార్‌ స్టేషన్‌ నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 3 వేల ఎకరాల అటవీ భూమిలో ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ స్టేషన్ ఏర్పాటుకు ఫారెస్ట్‌లోని 12 లక్షల మెుక్కలు నరికివేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


దామగుండం ప్రాంతంలోని అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. రాడార్ కేంద్రం ఏర్పాటు ద్వారా ఔషధ మొక్కలకు ప్రమాదం ఉందని, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని అంటున్నారు. వికారాబాద్‌ అడవుల్లో సహజ వనరులను కోల్పోతామని, వన్యప్రాణుల మనుగడకు కూడా ముప్పు కలుగుతుందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపపథ్యంలో అటవీ సంపదకు నష్టం వాటిల్లే అంశంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. రాడార్‌ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48 శాతం మాత్రమే స్టేషన్‌ నిర్మాణానికి ఉపయోగిస్తారని చెప్పారు. పోగా.. మిగిలిన 52 శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. అక్కడ 12 లక్షల చెట్లను తొలగించనున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్లు చెప్పారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేలా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.


అక్కడ కోల్పోనున్న చెట్లకు బదులుగా వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 2,348 హెక్టార్లలో క్షీణించిన ఫారెస్ట్ ప్రాంతంలో 17.55 లక్షల చెట్లను అటవీశాఖ నాటనుందని డోబ్రియాల్ అన్నారు. రాడార్‌ స్టేషన్‌ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. 32.10 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు, అక్కడ ఉన్న కొలను అలాగే ఉంటాయని చెప్పారు. భక్తుల ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండని అటవీ అధికారి డోబ్రియాల్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa