ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:32 PM

హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా హైడ్రా కూల్చివేతలు జోరందుకున్నాయి. సామాన్యుడు, సెలెబ్రిటీ, రాజకీయ నాయకుడు.. ఇలా తేడాలేమీ లేకుండా హైడ్రా బుల్డోజర్లు దండయాత్ర చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో సామాన్యులకు సంబంధించిన నిర్మాణాలు కూడా కూల్చివేయటం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే.. మొదట హైడ్రాపై ప్రశంసలు కురవగా.. ఇప్పుడు సామాన్యులు బాధితులవుతున్న నేపథ్యంలో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. పలువురు రాజకీయ నాయకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.


మొదట్లో హైడ్రా కూల్చివేతలను అభినందించిన కేఏ పాల్.. ఏపీలోనూ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్ల ఇండ్లను కూల్చి వేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నాగార్జున లాంటి పెద్ద హీరోకి చెందిన ఎన్ కన్వెన్షన్‌నే కూల్చివేశారని గుర్తు చేసిన కేఏ పాల్.. నాగార్జున కంటే పవన్ కల్యాణ్ పెద్ద హీరోనా అంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇల్లు కూడా నది పక్కనే ఉందంటూ కేఏ పాల్ గుర్తుచేశారు.


అయితే.. అప్పుడు అభినందించిన కేఏ పాల్.. ఇప్పుడు స్వరం మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి.. పరిపాలన గాలికి వదిలేసి హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. పెద్ద తలలను వదిలేసి పేద ప్రజల ఇండ్లను కూల్చేసి రోడ్డుపాలు చేస్తున్నారంటూ కేఏ పాల్ మండిపడ్డారు. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలను వెంటనే ఆపేయ్యాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రోడ్డునపడ్డ పేదలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేఏ పాల్ కోరారు. అంతేకాకుండా.. అక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రాపై కూడా హైకోర్టులో హౌస్‌మోషన్ వేస్తానని కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు.


అయితే.. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై స్పందించిన ఉన్నత స్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ 10 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఇప్పుడు హైడ్రాపై కూడా పిటిషన్ వేసేందుకు పాల్ సిద్ధమవుతుండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa